‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ పురస్కారాన్ని అందుకొని భారతదేశ కీర్తిని విశ్వవేదికపై ఘనంగా చాటారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి. ఈ సందర్భంగా ఓ ప్రైవేట్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మను తన జీవితంలో మొదటి ఆస్కార్లా భావిస్తానని చెప్పారు కీరవాణి. రామ్గోపాల్వర్మ దర్శకత్వం వహించిన ‘క్షణం క్షణం’ చిత్రానికి కీరవాణి సంగీతాన్నందించారు. ఆ సినిమా ఆయన కెరీర్కు మంచి బ్రేక్నిచ్చింది. వరుస అవకాశాలతో దూసుకుపోయారు. ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ ‘ఆ రోజుల్లో అవకాశాల కోసం తిరుగుతూ నేను ఎంతో మందిని కలిశా.
ఎవరూ ఛాన్స్ ఇవ్వలేదు. ఎక్కడకు వెళ్లినా తిరస్కారాలే ఎదురయ్యేవి. అప్పుడు వర్మ నాకు ‘క్షణం క్షణం’లో పనిచేసే అవకాశమిచ్చారు. అప్పటికే ‘శివ’ చిత్రంతో సంచలన దర్శకుడిగా వర్మ పేరు మార్మోగిపోతున్నది. ఆ సమయానికి నేను అంతగా ఎవరికీ తెలియదు. వర్మ అవకాశమివ్వగానే నాలో ఏదో ప్రత్యేకమైన ప్రతిభ ఉందని అందరూ భావించారు. దాంతో వరుస అవకాశాలు వరించాయి. వర్మతో పనిచేయడం వల్ల నా కెరీర్ మలుపుతిరిగింది’ అంటూ కీరవాణి పేర్కొన్నారు. కీరవాణి వీడియోపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘నేను చనిపోయాననే భావన కలుగుతున్నది. ఎందుకంటే పోయిన వారిపైనే ఇంత గొప్పగా ప్రశంసలు కురిపిస్తారు’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.