ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నది. ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించడంపై పలువురు సినీ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి దర్శకుడు రామ్గోపాల్వర్మ కొన్ని బహిరంగ ప్రశ్నలను సంధించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. వర్మ మాట్లాడుతూ ‘సినిమా నిర్మాణ వ్యయంలో పారితోషికాలతో పాటు అనేక అంశాలు కలిసి ఉంటాయి. వ్యయం, పారితోషికం వేర్వేరు కాదు. హీరోల ఇమేజ్ను అనుసరించే సినిమాలకు ఆదరణ ఉంటుంది. హీరోల సినిమాల వసూళ్లు, వారి ట్రాక్రికార్డులకు అనుగుణంగా నిర్మాతలు వారికి పారితోషికాలు ఇస్తారు.
హీరోలకు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనేది నిర్మాతలు కాకుండా ఇతరులకు నిర్ణయించే హక్కులేదు. సినిమాలను తక్కువ బడ్జెట్లో తీస్తూ హీరోలకు మాత్రం అధిక మొత్తాల్లో పారితోషికాలు చెల్లిస్తున్నారనే వాదన అర్థరహితం. కొనుగోలుదారుడికి, అమ్మకందారుడికి మధ్య జరిగే విక్రయ ఒప్పందాల్లో ప్రభుత్వం పాత్ర ఏమిటో స్పష్టం చేయాలి. ఉత్పత్తులు అధికమవ్వడమో, పూర్తిగా తగ్గిపోయే పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకుంటుంటాయి. అలాంటి పరిస్థితి సినీ పరిశ్రమకు ఎప్పుడు వచ్చిందో ఏపీ ప్రభుత్వం చెప్పాలి. సినిమాను రూపొందించడానికి అయిన వ్యయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం టికెట్ల ధరలను నిర్ణయించడం సరికాదు. దాని వల్ల నిర్మాతల్లో స్ఫూర్తితత్వం లోపిస్తుంది. సినిమాల నాణ్యత ప్రమాణాలు తగ్గిపోయే ఆస్కారముంది. సినిమాను నిత్యావసర వస్తువుగా పరిగణించి పేదలకు తక్కువ ధరలకే దానిని అందించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు విద్య, వైద్యం తరహాలో సినిమాలకు సబ్సిడీలను ఎందుకు ఇవ్వకూడదో ప్రభుత్వం చెప్పాలి’ అని పేర్కొన్నారు.
వర్మ చెప్పినవన్నీ నిజాలే: నాగబాబు
టికెట్ రేట్ల విషయంలో రామ్గోపాల్వర్మ వెలిబుచ్చిన అభిప్రాయాలకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు సీనియర్ నటుడు నాగబాబు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘మీరు అడిగిన ప్రశ్నలన్నీ నిజాలే. నేను అడగాలనుకుంటున్న ప్రశ్నలన్నీ మీ నోటి ద్వారా బయటికొచ్చాయి’ అని నాగబాబు ట్విట్టర్లో వ్యాఖ్యానించారు.