అగ్ర హీరో రామ్చరణ్ నటిస్తున్న పానిండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’ నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈచిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఎన్నో ప్రత్యేకతలతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం తాజాగా మరో ప్రత్యేకతను కూడా సొంతం చేసుకున్నది. టాలీవుడ్లో అత్యాధునిక డాల్బీ ఫార్మాట్లో విడుదల కానున్న తొలి సినిమాగా ‘పెద్ది’ నిలువనుంది.
రామ్చరణ్ రగ్గ్డ్ అవతార్ను డాల్బీ సినిమాస్ ఫార్మాట్లో చూడటం ప్రేక్షకులకు ఓ గొప్ప అనుభూతినిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో.. బ్యాట్ పట్టుకొని మైదానాన్ని రఫ్ఫాడించే ఆటకూలీగా రామ్చరణ్ దర్శనమిస్తున్నారు. ఉత్తరాంధ్ర నేపథ్యంతో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతిబాబు, బోమన్ ఇరానీ, దివ్యేందుశర్మ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్.రత్నవేలు, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, సహనిర్మాత: ఇషాన్ సక్సేనా, సమర్పణ: మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్.