‘పెద్ది’ చిత్రానికి ప్రీమియర్స్ నుంచే అద్భుతమైన స్పందన లభించిందని, తొలిరోజు హీరో రామ్చరణ్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు. రామ్చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ పతాకంపై ఆయన నిర్మించిన ‘పెద్ది’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా శుక్రవారం ‘బాక్సాఫీస్ ఛాంపియన్’ పేరుతో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ ‘ఈ చిత్రం తొలిరోజే 135 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. ప్రేక్షకులు ఈ సినిమాను బ్లాక్బస్టర్ హిట్గా నిలబెట్టారు. పిల్లలతో కలిసి థియేటర్లలో ఈ సినిమా చూడండి. ప్రతి ఒక్కరికి స్ఫూర్తివంతంగా అనిపిస్తుంది’ అన్నారు.
ఈ సినిమా వసూళ్లపరంగా ఓ తుపాను సృష్టించిందని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత వై.రవిశంకర్ ఆనందం వ్యక్తం చేశారు. విడుదలైన ప్రతీ కేంద్రం నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయని, ఉభయ తెలుగు రాష్ర్టాల్లో అదే ఊపు కనిపిస్తున్నదని ఆయన చెప్పారు. థియేటర్లలో చూసి ఆనందించాల్సిన సినిమా ఇదని, ఈ వారాంతంలో వసూళ్లు మరింత జోరుగా ఉంటాయని, వచ్చే వారం షాకింగ్ కలెక్షన్ నెంబర్లతో ముందుకొస్తామని వై.రవిశంకర్ తెలిపారు.
ఈ సినిమా చూసి స్ఫూర్తిపొందామని చాలా మంది తనతో చెబుతున్నారని, రామ్చరణ్ పర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని దర్శకుడు బుచ్చిబాబు సానా అన్నారు. రానున్న రోజుల్లో ఈ సినిమా మరిన్ని రికార్డులను బద్దలుకొట్టబోతున్నదని మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ చెప్పారు.