జూన్ 4న రామ్చరణ్ ‘పెద్ది’ సినిమా ఆరోగ్యకరమైన వాతావరణంలోనే విడుదలవుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు అగ్ర నిర్మాత దిల్ రాజు. ప్రస్తుతం తెలుగు సినీరంగంలో పర్సంటేజీ విధానం అమలుపై ఎగ్జిబిటర్లు, నిర్మాతల మధ్య వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్లో సినీ నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు డి.సురేష్బాబు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశానంతరం దిల్రాజు మాట్లాడుతూ ‘ఎగ్జిబిటర్లు కోరుతున్నట్లుగా పర్సంటేజీ విధానానికి నిర్మాతలు సానుకూలంగానే ఉన్నారు. అయితే ఏ, బీ, సీ సెంటర్లను బట్టి పర్సంటేజీని నిర్ణయించాల్సి ఉంటుంది. ఇందుకు అన్ని సెక్టార్లతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం’ అన్నారు.
పర్సంటేజీ అమలులో విధివిధానాలను చర్చించడానికి 21 మందితో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు డి.సురేష్బాబు తెలిపారు. ఇందులో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్.. ఈ మూడు సెక్టార్ల నుంచి ఏడుగురు చొప్పున మొత్తం 21 మంది సభ్యులు ఉంటారని, రెండు నెలల్లో ఈ కమిటీ నివేదిక సమర్పిస్తుందని డి.సురేష్బాబు పేర్కొన్నారు.