Ram charan | మెగా పవర్ స్టార్ రామ్చరణ్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ రియల్ హీరో అని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. కాగా తాజాగా మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. క్యాన్సర్తో పోరాడుతున్న ఓ చిన్నారి చివరి కొరిక తీర్చి ఉదారతను చాటుకున్నాడు. తొమ్మిదేళ్ల మణి కుశాల్ చరణ్కు వీరాభిమాని. అయితే ఆ చిన్నారి గతకొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం ఆ చిన్నారి హైదరాబాదులోని స్పర్శ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా జీవితంలో ఒక్కసారైనా రామ్ చరణ్ ను కలవాలని ఆ చిన్నారి తన కోరికను తల్లిదండ్రులకు తెలిపాడు.
ఈ విషయాన్ని మేక్ ఏ విష్ ఫౌండేషన్ వారు రామ్చరణ్కు తెలియజేశారు. ఆ చిన్నారి పరిస్థితి తెలుసుకున్న చరణ్ స్పర్శ్ ఆసుపత్రికి వెళ్లాడు. చికిత్స పొందుతున్న మణి కుశాల్ తో కాసేపు సరదాగా గడిపాడు. అంతేకాకుండా ఆ చిన్నారికి ఓ బహుమతిని ఇచ్చాడు. అలాగే మణి త్వరగా కోలుకుంటాడని చిన్నారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారికి అండగా నిలుస్తానని మాట ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. గురువారం చార్మినార్ దగ్గర RC15 షూటింగ్ జరుపుకుంటున్న చరణ్.. ఈ విషయం తెలిసుకొని అటునుంచి అటే అభిమానిని కలవడానికి వెళ్లాడు.