Ram Charan | రామ్చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం బుధవారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్నది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఏ.ఆర్.రెహమాన్ స్వరకర్త. ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్నివ్వగా, బోనీ కపూర్ కెమెరా స్విఛాన్ చేశారు. అగ్ర దర్శకుడు శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రామ్చరణ్ మాట్లాడుతూ ‘దర్శకుడు బుచ్చిబాబు ‘రంగస్థలం’ చిత్రానికి సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. అప్పటి నుంచి మా ప్రయాణం కొనసాగుతున్నది. ఈ సినిమాకు గొప్ప టీం కుదిరింది. నా కెరీర్లో ఇంత త్వరగా ఏ.ఆర్.రెహమాన్తో పనిచేస్తానని అనుకోలేదు.
ఇది ఖచ్చితంగా అద్భుతమైన సినిమా అవుతుంది’ అన్నారు. ఈ కథ చాలా బాగుందని, ఇప్పటికే మూడు ట్యూన్స్ సిద్ధం చేశానని ఏ.ఆర్.రెహమాన్ తెలిపారు. ఈ సినిమా సాకారం కావడానికి ప్రధాన కారణం తన గురువు సుకుమారేనని, రామ్చరణ్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గొప్ప చిత్రాన్ని అందిస్తానని దర్శకుడు బుచ్చిబాబు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు శంకర్, సుకుమార్, నిర్మాత అల్లు అరవింద్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర గ్రామీణ నేపథ్యంలో క్రీడా కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రామ్చరణ్ నటిస్తున్న 16వ చిత్రమిది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: అవినాష్ కొల్లా, పాటలు: చంద్రబోస్, అనంత శ్రీరామ్, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, దర్శకత్వం: బుచ్చిబాబు సానా.