రామ్చరణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రాన్ని దిగ్దర్శకుడు శంకర్ రూపొందిస్తున్నారు. కియారా అద్వానీ నాయికగా నటిస్తున్నది. పాన్ ఇండియా మూవీగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. రాజకీయ నేపథ్య చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంటున్నది. ఈ సినిమా నుంచి అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. రామ్చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాను ముందస్తు షెడ్యూల్ ప్రకారం వచ్చే సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేశారు.
అయితే తాజా సమాచారం ప్రకారం మరో నెల ముందుగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’, మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలు సంక్రాంతి రిలీజ్కు సిద్ధమవుతుండటం, మరోవైపు దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఇండియన్ 2’ కూడా జనవరి విడుదలకు సన్నద్ధ్దమవడంతో చరణ్ చిత్రాన్ని నెల ముందుగానే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం. దీనిపై నిర్మాణ సంస్థ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో శ్రీకాంత్, అంజలి, సునీల్, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.