Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన కొణిదెల ప్రస్తుతం ముగ్గురు పిల్లలతో సంతోషకరమైన కుటుంబ జీవితం గడుపుతున్నారు. 2023లో జన్మించిన క్లింకాతో పాటు, 2026 జనవరిలో ఈ దంపతులకు కవలలు (ఒక బాబు, ఒక పాప) పుట్టిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి స్వయంగా మనవడు, మనవరాలికి ‘శివ రామ్ కొణిదెల’, ‘అన్వీర దేవి కొణిదెల’ అని నామకరణం చేసిన విషయం అభిమానులకు తెలిసిందే. ఈ పేర్లలో కుటుంబ భావోద్వేగాలు, సంప్రదాయం ప్రతిబింబిస్తాయని ఆయన అప్పుడే వెల్లడించారు.ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రామ్ చరణ్, పిల్లల పెంపకంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. “నేను కొంచెం రఫ్గా ఉండే తండ్రిని. పిల్లలు పడిపోతే, మట్టిలో ఆడితే, ఎత్తుపల్లాలు ఎక్కినా నేను భయపడను. వాళ్లు ధైర్యంగా, సాహసంగా పెరగాలని కోరుకుంటాను” అని తెలిపారు.
అదే సమయంలో, వారి తల్లి ఉపాసన చాలా సున్నితంగా, ప్రేమగా చూసుకుంటుంది. కానీ ఏదైనా రిస్క్ తీసుకోవాలంటే పిల్లలు నా దగ్గరికే వస్తారు అంటూ తన పెరెంటింగ్ స్టైల్ను వివరించారు. కుటుంబంతో గడిపే సమయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని రామ్ చరణ్ స్పష్టం చేశారు. స్టార్డమ్ ఎంత ఉన్నా, పిల్లలు పెరుగుతున్న సమయంలో వాళ్లతో ఉండటం చాలా ముఖ్యం. నా ప్రపంచం చాలా చిన్నది.. అది నా కుటుంబం, నా పెంపుడు జంతువుల చుట్టూనే తిరుగుతుంది అని చెప్పారు. తన తల్లిదండ్రుల నుంచి నేర్చుకున్న విలువలను పిల్లలకు కూడా అందించాలని కోరుకుంటున్నానని చరణ్ వెల్లడించారు. షూటింగ్ల మధ్యలో విరామం దొరికినప్పుడల్లా పిల్లలతో గడపడానికి సమయం కేటాయిస్తున్నానని తెలిపారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో చరణ్ ఒక పెహిల్వాన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్లో ఈ మూవీ విడుదల కావలసి ఉండగా, ఇంకా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టలేదు. దీంతో చిత్ర రిలీజ్పై అనేక సందేహాలు ఉన్నాయి.