Ram Charan | బంధాలను అమితంగా ప్రేమించే సామాన్యుడి భావోద్వేగాలే ప్రధాన ఇతివృత్తంగా సుకుమార్ తెరెక్కించిన ‘రంగస్థలం’ సినిమా దర్శకుడిగా సుకుమార్లోని కొత్తకోణాన్ని ఆవిష్కరించింది. నటుడిగా రామ్చరణ్ని మరోస్థాయిలో నిలబెట్టింది. మళ్లీ ఈ కాంబినేషన్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆశల్ని నిజం చేస్తూ మళ్లీ కలిసి పనిచేయడానికి రామ్చరణ్, సుకుమార్ సిద్ధమయ్యారు. మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందనుంది.
రామ్చరణ్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమాగా సుకుమార్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని నిర్మాతలు చెబుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్స్టార్గా ఎదిగారు రామ్చరణ్. ‘పుష్ప’తో పాన్ఇండియా డైరెక్టర్గా నిలిచారు సుకుమార్. మారిన వీరి ఇమేజ్కి తగ్గట్టుగా కథ, కథనం, బడ్జెట్ ఉంటాయని నిర్మాతలు తెలిపారు. ఈ ఏడాదిలో షూటింగ్ మొదలుపెట్టి 2025 చివరిలో సినిమాను విడుదల చేస్తామని వారు చెప్పారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలందించనున్న ఈ పాన్ ఇండియా సినిమాకు నిర్మాతలు: నవీన్ యర్నేని, యలమంచిలి రవిశంకర్.