‘దేశానికి’ హృదయం లాంటి మధ్యప్రదేశ్లోని భోపాల్లో ‘పెద్ది’ ప్రమోషన్స్ షురూ కావడం ఆనందంగా ఉంది. ఇది మేమంతా మనసుపెట్టి చేసిన సినిమా. ప్రతి భావోద్వేగాన్ని, ప్రతి కష్టాన్ని, ప్రతి క్షణాన్నీ ఈ సినిమాకోసం అంకితం చేశాం. ‘పెద్ది’ స్పోర్ట్స్ ఫిల్మ్ మాత్రమేకాదు. గుర్తింపుకోసం పోరాడే ఓ వ్యక్తి కథ. మళ్లీమళ్లీ చూడాలనిపించేలా, స్ఫూర్తిదాయకంగా సినిమా ఉంటుంది. నా ఫిల్మ్ లైబ్రరీలో ‘పెద్ది’ నంబర్వన్ సినిమా. ఈ సినిమాకు బలమైన పిల్లర్ ఏఆర్ రెహ్మాన్. అద్భుతమైన పాటలిచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’పై చూపించిన ప్రేమను ఈ సినిమాపై కూడా చూపిస్తారని ఆశిస్తూ.. భారత్మాతాకీ జై ’ అని రామ్చరణ్ అన్నారు.
ఆయన హీరోగా రూపొందిన పానిండియా పీరియాడిక్ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శనివారం మధ్యప్రదేశ్ భోపాల్లో ఘనంగా నిర్వహించిన ‘పెద్ది కా ఆవాజ్’ ఈవెంట్లో రామ్చరణ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ ఈవెంట్ ఆహుతుల్ని ఉర్రూతలూగించింది.
ఇండియా మొత్తం వ్యాపించిన తెలుగు సినిమాను అభినందిస్తున్నానని, ‘పెద్ది’ రామ్చరణ్ వన్మ్యాన్ షో అనీ ఏఆర్ రెహమాన్ చెప్పారు. మధ్యప్రదేశ్రాష్ట్ర మంత్రివర్యులు విశ్వాస్ సారంగ్, రాకేష్ శుక్లా అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో చిత్రనిర్మాత వెంకటసతీశ్ కిలారు, కథానాయిక జాన్వీ కపూర్, దివ్యేందు శర్మ, రవికిషన్ కూడా మాట్లాడారు.