కథానాయికలకు అందించే పారితోషికం విషయంలో దర్శకనిర్మాతలు వివక్ష చూపిస్తున్నారనే అంశంపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది. హీరోలతో పోల్చితే హీరోయిన్లకు తక్కువ రెమ్యునరేషన్ దక్కుతున్నదని పలువురు అగ్ర నాయికలు ఆరోపిస్తున్నారు. తాజాగా ఈ విషయం గురించి రకుల్ప్రీత్సింగ్ స్పందించింది. కథానాయికల పర్ఫార్మెన్స్ వల్ల భారీ విజయాలు దక్కించుకున్న సినిమాలు ఎన్నో ఉన్నాయని, అలాంటప్పుడు పారితోషికం విషయంలో అంతా తేడా ఎందుకని ఈ భామ ప్రశ్నించింది.
ఆమె మాట్లాడుతూ ‘హీరోయిన్లు పాటలకు, ఏవో కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితమయ్యే రోజులు పోయాయి. ఇప్పుడు నాయికలు కథాగమనంలో కీలకంగా ఉంటున్నారు. అభినయ ప్రధాన పాత్రల్లో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. అగ్ర నటీమణులకు హీరోలతో సమానమైన క్రేజ్ ఉంది. కొన్ని మహిళా ప్రధాన చిత్రాలు వందకోట్ల వసూళ్లు దాటిన సందర్భాలున్నాయి. అందుకే పారితోషికాల విషయం లో వివక్ష చూపించొద్దు. ఈ పద్ధతి మారితేనే సినీరంగంలో మంచి మార్పులొస్తాయి’ అని చెప్పింది. గత కొంతకాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న ఈ భామ హిందీ, తమిళంలో మాత్రం వరుస సినిమాలతో బిజీగా మారింది.