రెండేళ్ల విరామం తర్వాత విదేశీ గడ్డపై షూటింగ్లో పాల్గొనడం ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చిందని చెప్పింది అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్. ఇటీవల ఈ భామ ఓ హిందీ సినిమా చిత్రీకరణ కోసం లండన్కు వెళ్లింది. అక్కడి బయోబబుల్ సెటప్లో చిత్రీకరణ చేయడం సౌకర్యవంతంగా ఉందని, అన్నింటికంటే ముఖ్యంగా ఎలాంటి మాస్క్లేకుండా బయట విహరించే వెసులుబాటు కలిగిఉండటం చెప్పలేని సంతోషాన్నిచ్చిందని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘నాకు నచ్చిన పర్యాటక ప్రదేశాల్లో లండన్ ఒకటి. ఇక్కడ నా ఫేవరేట్ రెస్టారెంట్స్కు వెళ్తూ..తీరిక సమయాల్లో షాపింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతున్నా. కరోనా మహమ్మారి విధించిన ఆంక్షల్ని ఛేదించుకొని రెండేళ్ల తర్వాత పూర్తి స్వేచ్ఛగా విహరించడం మాటల్లో చెప్పలేని అనుభూతినిస్తున్నది. ఇక షూటింగ్ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రతి రోజు పరీక్షలు చేయించుకుంటూ ఇక్కడి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా షూట్ చేస్తున్నాం. కరోనా పీడ వదిలిపోయి ప్రపంచ ప్రజలు సాధారణ జీవనస్రవంతిలో కలిసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం రకుల్ప్రీత్సింగ్ హిందీలో వరుస ప్రాజెక్ట్లతో బిజీగా ఉంది. తెలుగులో ఆమె నటిస్తున్న ‘కొండపొలం’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.