Song Controversy | కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా నటిస్తున్న ‘కేడీ’ సినిమాలోని ‘సర్కే చునార్ తేరీ సర్కే’ పాట ఇటీవల తీవ్ర వివాదానికి కారణమైన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితం విడుదలైన ఈ స్పెషల్ సాంగ్పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పాటలో డబుల్ మీనింగ్ పదాలు ఉన్నాయని, అలాగే నోరా ఫతేహి డ్యాన్స్ అశ్లీలంగా ఉందని నెటిజన్లు మండిపడ్డారు. ముఖ్యంగా హిందీ వెర్షన్లోని సాహిత్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఈ వివాదం పెద్దది కావడంతో కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించినట్లు వార్తలు వచ్చాయి. వెంటనే అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్ల నుంచి ఈ పాటను తొలగించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఈ పాట సాహిత్యంపై పలువురు సినీ ప్రముఖులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్కు నోటీసులు కూడా జారీ అయినట్లు సమాచారం.
హిందీలో ‘సర్కే చునార్’ అనే పదాలతో ప్రారంభమయ్యే ఈ పాటను గాయని మంగ్లీ ఆలపించారు. అయితే పాటలోని అసభ్యకరమైన పదాలపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, గాయకుడు అర్మాన్ మాలిక్, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వంటి పలువురు ప్రముఖులు తీవ్రంగా స్పందించారు. దీంతో కొందరు నెటిజన్లు దర్శకుడు ప్రేమ్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రేమ్ భార్య, ఒకప్పటి హీరోయిన్ రక్షిత ఈ వివాదంపై ఘాటుగా స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేస్తూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తనను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల గురించి తనకు పూర్తిగా తెలుసని రక్షిత తెలిపారు. అయితే గతంలో కూడా ‘పీలింగ్స్’, ‘డ్రీమ్ వేకప్’, ‘చోలీ కే పీచే క్యా హై’ వంటి పాటలు వచ్చినప్పుడు పెద్దగా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని ఆమె గుర్తు చేశారు.
అలాంటి వందల పాటలు వచ్చినా అప్పట్లో అవి సాధారణంగానే భావించారని, కానీ ఇప్పుడు ఒక్క ఈ పాట విషయంలోనే ఇంత పెద్ద వివాదం ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదని ప్రశ్నించారు. తాను ఈ పాటను పూర్తిగా సమర్థించడం లేదని స్పష్టం చేసిన రక్షిత, అయితే ఒక దర్శకుడి ప్రతిభను ఒక్క పాట ఆధారంగా తీర్పు ఇవ్వడం సరికాదని అన్నారు. గతంలో ప్రేమ్ మంచి పాటలు, సినిమాలు అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఒక తప్పు జరిగిందని భావించినా దాని ఆధారంగా ఆయనను పూర్తిగా విమర్శించడం తగదని వ్యాఖ్యానించారు. ఒక సినిమా విజయవంతం కాకపోతే ఆ దర్శకుడు చెడ్డవాడని చెప్పలేం. ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది. కానీ అవమానించే హక్కు ఎవరికీ లేదు అని రక్షిత తన పోస్టులో పేర్కొన్నారు. ఇక సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషణలు చేయడం కూడా సరికాదని ఆమె అన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా కొందరు అనవసర వ్యాఖ్యలు చేస్తుంటారని, అయినప్పటికీ తమ భాష, తమ ప్రజలంటే తనకు ఎంతో ప్రేమ ఉందని చెప్పారు. .