ఇద్దరు అన్నదమ్ముల పంచాయితీ తెలంగాణలోని జమ్మికుంట అనే ఊరి రాతనే ఎలా మార్చింది? వారిలో గెలుపెవరిదైనా ఊరు మాత్రం ఎందుకు ఓడింది? రామాయణంలో రామలక్ష్మణుల్లా కలిసి ఉండాల్సిన అన్నదమ్ములు, మహాభారతంలోని సోదరుల్లా ఎందుకు గొడ్డళ్లు పట్టారు? ఏ ఇంట్లోనూ జరగకూడని ఈ కథలో అసలేం జరిగింది? ఈ అన్నదమ్ముల పంచాయితీ ఏంటో అంతా కలిసి చూద్దాం.. అంటూ ‘రాజు వెడ్స్ రాంబాయి’ మేకర్స్ ఆహ్వానం పలికారు. మళ్లీ కొత్తవారితో వారు మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణలో పుట్టిన మరో మట్టి కథ పరిమళాన్ని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమయ్యారు. వేణు ఊడుగుల, సంధ్య భానుచల్లా నిర్మించనున్న ఈ చిత్రానికి మధుకర్రెడ్డి కోమిరెడ్డి దర్శకుడు. ఆసక్తికరమైన ఈ సినిమాలో నటించేందుకు ఔత్సాహికుల్ని మేకర్స్ ఆహ్వానిస్తున్నారు. ‘తెలంగాణ యాస బాస అచ్చిన తెలుగోళ్లంతా ఈడియోలు పెట్టుర్రి’ అని ప్రకటనలో పేర్కొన్నారు. డోలాముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, ఆరాధ్య సినీ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నది.