Rajinikanth | సూపర్స్టార్ రజనీకాంత్లో ఆధ్యాత్మిక భావాలు చాలా ఎక్కువనే విషయం అందరికి తెలిసిందే. ఆయన మాటల్లో కూడా తాత్వికత కనిపిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం ఆయన ప్రతీ ఏటా హిమాలయాలను సందర్శిస్తారు. అక్కడి సుందరమైన ప్రకృతిలో కొద్ది రోజులు ఏకాంతంగా గడుపుతారు. తన సినిమాల విడుదలకు ముందు హిమాలయా యాత్ర చేయడం రజనీకాంత్ ఆనవాయితీగా పెట్టుకున్నారు. అయితే కరోనా కారణంగా గత నాలుగేళ్లుగా ఆయన హిమాలయా యాత్ర చేపట్టలేదు.
రజనీకాంత్ తాజా చిత్రం ‘జైలర్’ ఈ నెల 10న విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం రజనీకాంత్ హిమాలయాలకు పయనమయ్యారు. నాలుగైదు రోజుల పాటు ఆయన అక్కడే గడిపే అవకాశం ఉందని తెలిసింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ‘జైలర్’ చిత్రంపై దక్షిణాదిన ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. ప్రస్తుతం సినిమాపై నెలకొన్న హైప్ను చూస్తే భారీ విజయం తథ్యమని అభిమానులు అంచనా వేస్తున్నారు.