సూపర్స్టార్ రజనీకాంత్ ‘కూలీ’ సినిమా ట్రైలర్ శనివారం విడుదలైంది. అత్యంత భారీ అంచనాలతో ఈ నెల 14న సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ స్టార్ల సమూహంతో.. ఓ పాలపుంతను తలపించింది. రజనీకాంత్, అక్కినేని నాగార్జున, ఆమిర్ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్.. ఇంతమంది హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోవడం ప్రేక్షకులకు విజువల్ ఫీస్టే అనాలి. ‘ఒకడు పుట్టగానే.. వాడు ఎవడిచేతిలో చావాలన్నది తలమీద రాసిపెట్టుంటది.’ అనే నాగార్జున డైలాగ్తో ట్రైలర్ మొదలైంది. ఇందులో నాగార్జున ‘సైమన్’గా కెరీర్లో తొలిసారి భయంకరమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నారు.
ట్రైలర్లో నాగ్ స్క్రీన్ ప్రెజెన్స్, ైస్టెలిష్ లుక్ ఆడియన్స్ని షాక్కు గురిచేసేలా ఉంది. ట్రైలర్లో కనిపిస్తున్న భారీ తనం, ఊహించని ఉద్వేగాలు, మలుపులు, రజనీ మార్క్ యాక్షన్ సన్నివేశాలు చూస్తుంటే దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఓ విజువల్ వండర్నే క్రియేట్ చేశాడనిపిస్తుంది. మూడు నిమిషాల నిడివి గల ఈ ట్రైలర్లో 1 నిమిషం 7 సెకన్ల దగ్గర మొదలైన రజనీకాంత్ ఎంట్రీ అదిరిపోయింది. ఆయన రూపం, ఆ ైస్టెల్ అభిమానులు పండుగ చేసుకునేలా ఉంది. ఇందులో శ్రుతీహాసన్ది ఇంపార్టెంట్ రోల్ అని ట్రైలర్ చెబుతున్నది.
శ్రుతీహాసన్, రజనీకాంత్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘వాడు నీకు నాన్న.. నాకు ప్రాణస్నేహితుడు’ అని శ్రుతిహాసన్తో రజనీకాంత్ అనడం.. రజనీ, కమల్ స్నేహాన్ని గుర్తు చేసేలా ఉంది. గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం, అనిరుథ్ నేపథ్య సంగీతం సన్నివేశాలకు నిండుదనాన్ని చేకూర్చాయి. ‘ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావ్రా..’ అని రజనీ చెప్పిన డైలాగ్తో ట్రైలర్ ముగిసింది. మొత్తంగా ‘కూలీ’ ట్రైలర్ అంచనాలను పెంచేసిందని చెప్పొచ్చు. కళానిధిమారన్ ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే.