Rajendra Prasad | టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. తమిళ దిగ్గజ నటుడు, మాజీ ముఖ్యమంత్రి M. G. రామచంద్రన్ (ఎంజీఆర్) గురించి మాట్లాడిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో తమిళ సినీ ప్రముఖులు కూడా స్పందించారు. ప్రముఖ నటుడు నాజర్, నిర్మాత విశాల్ కూడా రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.ఎంజీఆర్ వంటి మహోన్నత వ్యక్తిని ఒకరితో పోలుస్తూ చిన్నబుచ్చేలా మాట్లాడటం తగదని, ఇది తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని వారు పేర్కొన్నారు. రాజేంద్రప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు.
ఈ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో రాజేంద్రప్రసాద్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తమిళంలో మాట్లాడిన ఆయన తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరారు.నేను ఎంజీఆర్ను ఎంతో గౌరవించే వ్యక్తిని. తమిళ ప్రేక్షకుల మాదిరిగానే ఆయనను దైవంలా భావిస్తాను. ఆయన గురించి తప్పుగా మాట్లాడే ధైర్యం నాకు ఎలా ఉంటుంది? అని ఆయన ప్రశ్నించారు. తాను మద్రాస్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో చదువుకునే రోజుల్లో ఎంజీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారని రాజేంద్రప్రసాద్ తెలిపారు. అప్పట్లో తాము నటన సాధన చేస్తుంటే ఎంజీఆర్ స్వయంగా వచ్చి చూసేవారని, ఆయన కళాకారులను ఎంతగానో ప్రోత్సహించేవారని గుర్తు చేసుకున్నారు.
అయితే తన ప్రసంగంలో అనుకోకుండా ఆ మాటలు వచ్చాయని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని ఆయన స్పష్టం చేశారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే హృదయపూర్వకంగా క్షమించాలని కోరారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా మరింత జాగ్రత్తగా మాట్లాడుతానని రాజేంద్రప్రసాద్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన క్షమాపణలతో ఈ వివాదం చల్లారుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది