రాజశేఖర్ హీరోగా నటిస్తున్న సినిమా ‘శేఖర్’. మలయాళ హిట్ ఫిల్మ్ జోసెఫ్కు రీమేక్గా దర్శకురాలు జీవిత రాజశేఖర్ తెరకెక్కిస్తున్నారు. ఆత్మీన్ రాజన్ నాయికగా నటిస్తున్నది. శివానీ రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నది. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో బీరం సుధాకర్ రెడ్డి, శివానీ, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 20న విడుదల కాబోతున్నది.
తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్, నటుడు సముద్రఖని అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ…‘చిన్నప్పుడు హీరో రాజశేఖర్ సినిమాలు ఎక్కువగా చూసేవాడిని. ఆయన గొంతును అనుకరించేవాడిని. అలా సినిమా పట్ల నేను ఆకర్షితుడిని కావడానికి రాజశేఖర్ గారు కారణం. ఆయన తన పిల్లలను ఇండస్ట్రీకి దూరం పెట్టకుండా మన సినీ కుటుంబంలోకి తీసుకొచ్చారు.
ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు. హీరో రాజశేఖర్ మాట్లాడుతూ..‘సినిమా కోసం జీవిత చాలా కష్టపడింది. మా ఇద్దరు కూతుళ్లు పోస్ట్ ప్రొడక్షన్లో పనిచేశారు. సినిమా చూసి నచ్చితే పది మందికి చెప్పండి. సినిమానే మా జీవితం. ప్రేక్షకులు సినిమాలను ఆదరిస్తేనే ఇండస్ట్రీ బాగుంటుంది. అనూప్ మంచి సంగీతాన్ని అందించారు’ అన్నారు.
‘టికెట్ రేట్లు పెరగడం వల్ల ప్రేక్షకులు ఎక్కువగా సినిమా చూసేందుకు రావడం లేదని విన్నాను. మా సినిమాకు ప్రభుత్వం నిర్ణయించిన రేట్లే పెట్టాలని పంపిణీదారులకు చెప్పాము. హృదయానికి హత్తుకునే చిత్రమిది. చూసి ఆదరించాలని కోరుకుంటున్నా’ అని జీవిత రాజశేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శివానీ, శివాత్మిక, దర్శకులు విజయభాస్కర్, ప్రశాంత్ వర్మ, హీరో రాజ్ తరుణ్, సంగీత దర్శకుడు అనూప్ తదితరులు పాల్గొన్నారు.