Rajamouli | అగ్ర దర్శకుడు రాజమౌళి కలల ప్రాజెక్ట్స్లో ‘మహాభారతం’ ఒకటి. ఈ చిత్రాన్ని దృశ్యమానం చేయడం తన జీవితాశయాల్లో ఒకటని రాజమౌళి అనేక సందర్భాల్లో చెప్పారు. మహాభారత కథను పలు భాగాల్లో సంపూర్ణంగా ఆవిష్కరించడానికి పదేళ్ల సమయం పట్టొచ్చని కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజమౌళి. తాజాగా ఈ సినిమా గురించి రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. మరో రెండుమూడేళ్ల తర్వాతే ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
‘ ప్రస్తుతం మహేష్బాబు సినిమా సన్నాహాల్లో రాజమౌళి ఉన్నారు. ఇదొక యాక్షన్ అడ్వెంచర్ మూవీ. భారీ హంగులతో తెరకెక్కించబోతున్నాం. ‘ఆర్ఆర్ఆర్’కు మించి ఉంటుంది. దీని తర్వాత ‘ఆర్ఆర్ఆర్’కు సీక్వెల్ చేయబోతున్నాం. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించే ఈ చిత్రానికి దర్శకుడెవరనేది ఇంకా నిర్ణయించలేదు. అయితే ఎవరు తీసినా రాజమౌళి పర్యవేక్షణలోనే సినిమా తెరకెక్కుతుంది. ఈ రెండు ప్రాజెక్ట్లు పూర్తయిన తర్వాతే రాజమౌళి కలల సినిమా ‘మహాభారతం’ పట్టాలెక్కే అవకాశం ఉంటుంది’ అని విజయేంద్రప్రసాద్ పేర్కొన్నారు.