కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సినిమా రంగానికి చాలా నష్టం వాటిల్లింది. కరోనా వలన చాలా సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పటికీ కొన్ని ఓటీటీలోకి వస్తున్నాయి. అయితే ఓటీటీలో సినిమాలు విడుదల కావడం విషయంపై రాజమౌళికి ప్రశ్న ఎదురు కాగా, ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. శుక్రవారం ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడారు. ‘ఆర్ఆర్ఆర్’ ఓటీటీకి వెళుతుందంటూ వార్తలొచ్చాయి. ‘‘నేను థియేటర్ల కోసమే సినిమాలు తీస్తాను. ఎక్కువమంది ప్రేక్షకులు ఒక్కచోట చేరి ఆస్వాదించే లక్ష్యంగానే నా సినిమాలుంటాయి. అందుచేత థియేటర్లోనే విడుదలవుతాయి. ఎలాంటి సందేహం లేదు’’ అని చెప్పారు రాజమౌళి.
సినిమాల మధ్య క్లాష్ అనేది వ్యాపారంపై ప్రభావం చూపదు. ఒకేసారి నాలుగు చిత్రాలు విడుదలైనా బాగుంటే నాలుగింటిని ప్రేక్షకులు చూస్తారు. జనవరిలో చాలా చిత్రాలొస్తున్నాయి. అన్ని చిత్రాలు బాగా ఆడి, మంచి వసూళ్లు రాబట్టి ప్రేక్షకులకు వినోదం పంచాలని కోరుకుంటున్నా’’అన్నారు. ‘‘నాకు ఈ భాష నటులు, ఆ భాష నటులు అని భేదాలు ఏమీ లేవు. నా కథ, స్క్రిప్ట్కు ఎవరూ సరిపోతారు చూసుకొని వారినే సంప్రదిస్తాను. ‘బాహుబలి’ అనే సినిమాను ఉపయోగించుకొని ఎవరి దగ్గరికి వెళ్లను. నా స్క్రిప్ట్ను నమ్ముకొనే నేను ముందుకు వెళుతుంటా’’ అని చెప్పుకొచ్చారు.
ముంబైలో జరిగిన ‘పీవీఆర్ఆర్ఆర్’ లోగో ఆవిష్కరణకు హాజరైన రాజమౌళి విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ ‘పీవీఆర్ఆర్ఆర్’ లోగో కొనసాగనుందని ఆయన స్పష్టంచేశారు.