ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఆస్కార్ వేడుకకు రంగం సిద్ధమవుతున్నది. ఈ నెల 12న అమెరికా లాస్ఏంజెల్స్లో ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవ వేడుక జరగబోతున్న విషయం తెలిసిందే. ఈసారి భారత్ నుంచి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ కోసం పోటీపడుతున్నది. ఈ నేపథ్యంలో ఈ పాటను ఆస్కార్ వేదికపై లైవ్ పర్ఫార్మ్ చేయబోతున్నారు.
ఈ విషయాన్ని ఆస్కార్ అకాడమీ అధికారికంగా వెల్లడించింది. ‘నాటు నాటు’ పాటను పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ వేదికపై ఈ పాటను ఆలపించబోతున్నారు. ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ ‘ఇవి నా జీవితంలో మరచిపోలేని క్షణాలుగా మిగిలిపోతాయి’ అన్నారు. ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్నందించగా, కీరవాణి స్వరాల్ని సమకూర్చారు.