దర్శకుడు రాజమౌళి ‘బాహుబలి’ కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు తెలుగు సినిమాకు ఇంత పెట్టుబడి ఎలా తిరిగొస్తుంది అనుకున్నాం. వాళ్లు దాన్ని సక్సెస్ చేసి చూపించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు 600 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు ఆస్కార్ అవార్డుల కోసం 80 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆ డబ్బులతో ఓ పది చిన్న చిత్రాలు తెరకెక్కించవచ్చు అని దర్శక నిర్మాత తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. తమ్మారెడ్డి వ్యాఖ్యలపై నటుడు నాగబాబు, సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించారు.
రాఘవేంద్రరావు మాట్లాడుతూ…‘తెలుగు సినిమాకు, తెలుగు నటులకు, తెలుగు సాహిత్యానికి, తెలుగు దర్శకులకు ప్రపంచ వేదిక మీద వస్తున్న పేరును చూసి గర్వపడాలి. 80 కోట్ల రూపాయల ఖర్చు అంటూ చెప్పడానికి నీ దగ్గర లెక్కల వివరాలు ఉన్నాయా? జేమ్స్ కామెరూన్, స్పీల్బర్గ్ వంటి దర్శకులు డబ్బులు తీసుకుని మన సినిమా గొప్పదనాన్ని పొగుడుతున్నారని నీ ఉద్దేశమా?’ అని అన్నారు.
నాగబాబు స్పందిస్తూ…‘చాలా రోజులుగా తమ్మారెడ్డి భరద్వాజ సినీ మేధావిలా మాట్లాడుతున్నారు. ఆయన ఎన్ని సినిమాలు చేశారు? ఆ చిత్రాల్లో నటించిన నటీనటుల్లో ఎంతమందికి పారితోషికాలు ఇచ్చారో చెప్పాలి. ఒక తెలుగు సినిమా అంతర్జాతీయ ఖ్యాతి పొందితే మీకు ఇంత కక్ష ఎందుకు? ఆస్కార్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ వాళ్లు డబ్బులు ఖర్చు చేసింది మీరు చూశారా? మీకు నచ్చితే సినిమాను ప్రశంసించండి కానీ ఇలా కించపరిస్తే మేము ఊరుకోం. గతంలోనూ భరద్వాజ పవన్ కళ్యాణ్, చిరంజీవి గురించి, వారి రాజకీయ ప్రస్థానం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు ఎన్నో చేశారు. అప్పుడు ఎందుకని ఊరుకున్నాం. కానీ ఇకపై సహించం’ అన్నారు. తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని తమ్మారెడ్డి భరద్వాజ వివరణ ఇచ్చారు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్ కోసం పెట్టిన 80 కోట్ల రూపాయల ఖర్చుతో తాను 10 సినిమాలు నిర్మించగలను అని మాత్రమే చెప్పానన్నారు.