Radhe Shyam OTT | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాధేశ్యామ్’. భారీ అంచనాలతో మార్చి 11న విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ దగ్గర కనీస స్థాయిలో కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత ప్రభాస్ను తెరపై చూడబోతున్నాం అనే ఉత్సాహంతో వచ్చిన అభిమానులను ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. ప్రభాస్ తన ఇమేజ్కు భిన్నంగా ఈ చిత్రంలో నటించాడు. ఫస్ట్ వీకెండ్లో ఈ చిత్రం కలెక్షన్లు బాగానే ఉన్న వీక్ డేస్ నుంచి భారీగా డ్రాప్స్ కనిపించాయి. దానికి తోడు పరభాష చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఈ చిత్రానికి గట్టి పోటీనిచ్చింది. ఈ క్రమంలో ముందుగా అనుకున్న తేది కంటే వారం రోజులు ముందుగానే ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది.
‘రాధేశ్యామ్’ ఏప్రిల్ 1 నుంచి తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమేజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా హిందీ డిజిటల్ హక్కులను మాత్రం నెట్ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. తాజాగా ఈ చిత్ర హిందీ వెర్షన్ మే4 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా పోస్టర్ను విడుదల చేసింది.‘రాధేశ్యామ్’ చిత్రాన్ని దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఫైనల్గా ఈ చిత్రం 212.76 కోట్ల కలెక్షన్లను సాధించింది. కృష్ణంరాజు కీలకపాత్రలో నటించన ఈ చిత్రంలో ప్రభాస్కు జోడిగా పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది.