తెలుగులో ఒకప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా పేరు తెచ్చుకుంది రాశీఖన్నా. ‘థాంక్యూ’ తర్వాత ఆమె తెలుగులో మరే చిత్రంలోనూ నటించలేదు. ప్రస్తుతం హిందీ, తమిళ భాషల్లో బిజీగా ఉంది. ఇటీవల ఈ భామ పుట్టిన రోజును జరుపుకుంది. ఈ సందర్భంగా తన ఇంటి తోటలో కొన్ని మొక్కలు నాటింది. ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. చెట్లు తనకు ఎంతో సంతోషాన్నిస్తాయని, చెట్ల పెంపకాన్ని గొప్ప బాధ్యతగా తీసుకున్నానని రాశీఖన్నా పేర్కొంది.
‘చాలా రకాల కారణాలతో నేను మొక్కలను పెంచుతున్నా. చెట్లు నా కళ్లకు రంగులను పంచుతాయి. ఏదో తెలియని సంతోషాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా నా ఆత్మను సంతృప్తి పరుస్తాయి. మున్ముందు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. పర్యావరణంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలకు కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాను’ అని ఇన్స్టాగ్రామ్లో వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తమిళం, హిందీ భాషల్లో నాలుగు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది రాశీఖన్నా.