ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల సందర్భంగా దేశ ప్రజలకు ఇచ్చిన మాటను ప్రధాని మోదీ నిలుపుకోవాలని అన్నారు ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి. సేవా రంగంలోని విద్యా వైద్యాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహించారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేయడం సరికాదన్నారు. స్నేహ చిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్. నారాయణమూర్తి ప్రధాన పాత్రలో నటించి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘యూనివర్సిటీ’ చిత్ర ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ…‘మన దేశంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించాను. సత్యానంద్ మాస్టర్ దగ్గర శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు ఈ చిత్రంలో నటించారు. విద్య, వైద్యం వంటి సేవా రంగాలను ప్రభుత్వమే నిర్వహించాలని రాజ్యాంగం చెబుతున్నది. కానీ ఈ రంగాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేయమనే హామీలను ప్రధాని మోదీ నిలుపుకోవాలి’ అన్నారు. హాస్యనటుడు బ్రహ్మానందం మాట్లాడుతూ…‘ఆర్ నారాయణమూర్తికి సినిమానే ప్రాణం. ప్రజా దర్శకుడు ఆయన. చలన చిత్రం అనే సముద్రం వంక అందరూ చూస్తే..ఆ సముద్రమే చూసే వ్యక్తి నారాయణమూర్తి. ఇవాళ చదువు కొనే రోజులు వచ్చాయి. విద్యను వ్యాపారం చేశారు. విద్యా వ్యవస్థలోని ఇలాంటి లోపాలను ప్రశ్నిస్తూ ఆయన ఈ చిత్రాన్ని రూపొందించారు. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు.