ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి పార్ట్ కోసం బన్నీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి, సామీ సామీ, ఏ బిడ్డ ఇది నా అడ్డా అనే పాటలు, టీజర్స్ ప్రేక్షకులను విపరీతంగా కట్టుకున్నాయి.
ట్రైలర్ కోసం ప్రేక్షకులు కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తుండగా, తాజాగా రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబర్ 6న ట్రైలర్ విడుదల కానుందని పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక ఈ పోస్టర్తో రిలీజ్ డేట్పై క్లారిటీ కూడా వచ్చింది. మొన్నటి వరకు డిసెంబర్ 24న విడుదల కానున్నట్టు ప్రచారం జరిగింది. కాని డిసెంబర్ 17న పుష్ప సినిమా ప్రేక్షకులని అలరించబోతున్నట్టు తెలుస్తుంది. పుష్ప ట్రైలర్ వేడుకని దుబాయ్లో ఘనంగా జరపనున్నారని సమాచారం.
చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్, యాంకర్ అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ ఫహద్ ఫాసిల్ అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా అది నిజం కాదని మొదటి భాగం చివర్లో ఆయన వస్తాడు అని సునీలే సినిమాలో మెయిన్ విలన్ అని సమాచారం. చిత్రంలో సునీల్ మంగళం శ్రీనుగా, అనసూయ దాక్షాయణిగా సరికొత్త లుక్లో సందడి చేయనున్నారు.