‘ఏయ్ బిడ్డా..ఇది నా అడ్డా..’ అంటూ శత్రుమూకలకు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు పుష్పరాజ్. అడవి తన అడ్డా…అది తన రాజ్యం అంటూ ఓ మాస్ గీతం ద్వారా తన బలమేమిటో చెబుతున్నాడు. ఈ వివరాలేమిటో తెలుసుకోవాలంటే ‘పుష్ప’ సినిమాలోని నాలుగో లిరికల్ సాంగ్ను చూడాల్సిందేనని అంటున్నది చిత్రబృందం. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’ డిసెంబర్ 17న ప్రేక్షకులముందుకురాబోతున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న కథానాయిక. శుక్రవారం ఈ సినిమాలోని నాలుగో పాటను విడుదల చేశారు. ‘ఆ పక్కా నాదే..ఈ పక్కా నాదే..తలపైన ఆకాశం ముక్కా నాదే..ఆ తప్పూ నేనే..ఈ ఒప్పు నేనే..తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే’..నన్నైతే కొట్టెటోడు..భూమ్మీదే పుట్టలేదు’ అంటూ మాస్ బాణీలో ఈ పాట సాగింది. దేవిశ్రీప్రసాద్ స్వరాల్ని సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యాన్నందించాడు. బాలీవుడ్ గాయకుడు నాకాశ్ అజీజ్ ఆలపించాడు. కథానాయకుడు పుష్పరాజ్ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అజయ్ఘోష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా క్యూబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, సాహిత్యం: చంద్రబోస్, నిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా, సీఈఓ: చెర్రీ, దర్శకత్వం: సుకుమార్.