‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా యువతరానికి చేరువైంది రష్మిక మందన్న. ఈ కూర్గ్ సొగసరి అందచందాలకు ముగ్ధులైన కుర్రకారు..నీ చూపే బంగారమాయనే.. అంటూ వలపు గీతాల్ని ఆలపిస్తున్నారు. కెరీర్లో అరంగేట్రం చేసిన అనతికాలంలోనే పాన్ఇండియా నాయికగా అవతరించిందీ భామ. ఆమె శర్వానంద్ సరసన కథానాయికగా నటించిన తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ నెల 4న ప్రేక్షకులముందుకురానుంది. ఈ సందర్భంగా ఇటీవల రష్మిక మందన్న పాత్రికేయులతో ముచ్చటిస్తూ చెప్పిన సంగతులివి..
తొలి లాక్డౌన్ సమయంలో దర్శకుడు కిషోర్ తిరుమల ఈ కథ చెప్పారు. వినోదం, సున్నితమైన భావోద్వేగాల కలబోతగా ఆకట్టుకుంది. కథలో మహిళా పాత్రలు ఎక్కువగా ఉండటంతో వాటిని ఎవరు పోషిస్తున్నారని అడిగా. వాళ్ల పేర్లు తెలుసుకోగానే చాలా సంతోషంగా అనిపించింది. ముఖ్యంగా సినిమాలోని ఇంటర్వెల్ సీన్ నా మనసును బాగా హత్తుకుంది. దాంతో మరో ఆలోచనలేకుండా వెంటనే సినిమా అంగీకరించాను. ఈ సినిమాలో నేను ఆద్య అనే చలాకీ అమ్మాయిగా కనిపిస్తా. ఎలాంటి భేషజాలు లేకుండా నా మనసులోని భావాల్ని నిర్మొహ మాటంగా చెబుతుంటా. అనుకున్నది సాధించే మనస్తత్వం నాది. నా కోసమే ఈ పాత్ర రాశారనిపించింది. సినిమాలోని మహిళల పాత్రలన్నీ సంభాషణ ప్రధానంగా ఉంటాయి. సన్నివేశాలన్నీ చాలా సహజంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో జరిగినట్లే అనిపిస్తాయి.
ఓ పిక్నిక్లా అనిపించింది..
శర్వానంద్తో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది. ‘పుష్ప’ షూటింగ్ నుంచి ‘ఆడవాళ్లు మీకు జోహారు’్ల సెట్లోకి వచ్చినప్పుడు చాలా రిలాక్స్గా అనిపించేది. అడవిలో షూటింగ్ నుంచి ఇంతమంది ఆడవాళ్ల మధ్యకు వచ్చే సరికి ఓ పిక్నిక్లా ఫీలయ్యేదాన్ని. సినిమాలో శర్వానంద్ను లేడీ క్యారెక్టర్స్ అన్నీ సరదాగా ఆటపట్టిస్తుంటాయి. దాంతో సినిమాలో ఆద్యంతం నవ్వులు పండాయి. ఇక దర్శకుడు కిషోర్ తిరుమలకు దైవభక్తి చాలా ఎక్కువ. ‘మాల వేసుకున్నారు.. దేవుణ్ణి ఏం కోరుకున్నారు సర్’ అని అడిగితే…ఇంతమంది మహిళలతో సినిమా చేస్తున్నాను కాబట్టి ప్రతి పని సవ్యంగా జరగాలని కోరుకున్నానని చెప్పేవారు. మహిళలు అంటే ఆయనకు ఎంత గౌరవభావం ఉందో ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది.
నా మీద ప్రేమతోనే…
ఈ సినిమాలో రాధిక, ఖుష్భూ వంటి సీనియర్ నటీమణులతో కలిసి పనిచేయడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. వాళ్లు బయట మనతో చాలా సరదాగా ఉంటారు. కెమెరా ముందుకు వెళ్లగానే తమ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు. వారి నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నా. నేను ఉన్నాను కాబట్టి సినిమా చాలా ఇంట్రెస్ట్గా మారిందని ఖుష్భూగారు అన్నారు. నా మీద ప్రేమతోనే ఆమె ఆ మాటలు చెప్పారు. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థలో పనిచేయడం సంతోషంగా ఉంది. ఇంతటి భారీ తారాగణం ఉన్నా ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. ఈ సంస్థలో మళ్లీ పనిచేయాలనుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం ఈ సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. పాటలన్నీ మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి.
బయోపిక్స్లో నటించాలనుంది..
భవిష్యత్తులో మరిన్ని కుటుంబ కథా చిత్రాల్ని చేయాలనుకుంటున్నా. ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్కు సాయిపల్లవి, కీర్తి సురేష్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. వారిద్దరూ నా హృదయానికి దగ్గరైనవారు. పరిశ్రమలోని సహచర నాయికలతో స్టేజీ పంచుకోవడం మనలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. నా పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తలు చూసి నవ్వుకొని వదిలేస్తున్నా. అదొక టైమ్పాస్ వ్యవహారంలా మారింది. నా పెళ్లి గురించి మాట్లాడటం అస్సలు ఇష్టం లేదు (నవ్వుతూ). ప్రస్తుతం ‘పుష్ప-2’ చిత్రంలో నటిస్తున్నా. మరో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరితే ఆ వివరాల్ని వెల్లడిస్తా. బాలీవుడ్ సినిమాల విషయంలో సెలెక్టివ్గా ఉంటున్నా. అక్కడ కూడా కొన్ని సినిమాల గురించి సంప్రదింపులు జరుగుతున్నాయి. బయోపిక్స్, చారిత్రక చిత్రాల్లో నటించాలని ఉంది. ప్రస్తుతానికైతే ఐటెంసాంగ్స్లో నటించాలనుకోవడం లేదు.