ఖైరతాబాద్, డిసెంబర్ 6 : జూనియర్ ఆర్టిస్టు ఫొటోలను రహస్యంగా తీసి.. బ్లాక్ మెయిల్కు పాల్పడి.. ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ సినీ నటుడిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై యాసిన్ అలీ తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడకు చెందిన శ్రేష్ట తన భర్తతో విడాకులు తీసుకుంది. హైదరాబాద్కు వచ్చి సంగీత్నగర్లో ఓ అద్దె గదిలో నివాసముంటూ జూనియర్ ఆర్టిస్టుగా జీవనం సాగిస్తున్నది. ఒకే రంగం కావడంతో.. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పక్కన సహాయ నటుడిగా పనిచేసిన కేశవ పాత్రధారి జగదీశ్ ప్రతాప్ బండారితో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొంత కాలం వీరు కలిసి ఉన్నారు. ఆ తర్వాత విడిపోయారు. కొద్ది రోజులకే ఆమెకు మరో వ్యక్తి పరిచయమయ్యాడు. అయితే, గత నెల 27న సదరు జూనియర్ ఆర్టిస్టు ఆ వ్యక్తితో ఉండగా జగదీశ్ ఫొటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడుతానంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అతడి వేధింపులతో గత నెల 29న ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. లోతుగా దర్యాప్తు చేయడంతో నటుడు జగదీశ్ ప్రతాప్ బండారి ఆమె ఆత్మహత్యకు కారకుడని తేల్చారు. బుధవారం అతడిని అరెస్టు చేసి విచారించగా, తప్పు ఒప్పుకున్నాడు. దీంతో జగదీశ్పై కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు.