Allu Arjun | “పుష్ప-2’ చిత్రాన్ని ఆదరిస్తూ నాపై ప్రేమ చూపిస్తున్న భారతీయులందరికీ కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులందరూ భారతీయ సినిమాను ఇంతలా ఆదరిస్తున్నందుకు స్పెషల్ థాంక్స్. ఇది నా ఒక్కడి విక్టరీ కాదు. ఇండియా విక్టరీ’ అన్నారు అల్లు అర్జున్. ఆయన కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప-2’ వరల్డ్వైడ్గా భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. ఇప్పటికే 1000కోట్ల వసూళ్ల మైలు రాయిని దాటింది. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీలో థాంక్యూ ఇండియా ప్రెస్మీట్ను నిర్వహించారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఈ విజయానికి క్రెడిట్ అంతా సుకుమార్దే. ఆయన విజన్, కష్టానికి ఫలితమే ఈ గ్రాండ్ సక్సెస్. భవిష్యత్తులో ఈ సినిమా మరిన్ని వసూళ్లు సాధిస్తుంది. అయితే ఈ కలెక్షన్ నంబర్స్ అన్నీ టెంపరరీ. ఫ్యూచర్లో మరో సినిమా వీటిని దాటేయొచ్చు. కానీ ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ మాత్రం శాశ్వతం. వారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను’ అన్నారు. అల్లు అర్జున్ కష్టానికి లభించిన ప్రతిఫలమే ఈ విజయమని చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హిందీ ఎగ్జిబిటర్స్ నిమిత్, సంజయ్, శశాంక్ రాజహెడ, యూపీ ఎగ్జిబిటర్ అశుతోష్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.