Pushpa 2 The Rule | ఇటీవలే విడుదలైన ‘పుష్ప 2’లోని తొలి లిరికల్ సాంగ్ సినీప్రియులను విశేషంగా ఆకట్టుకోవడమే కాక, రికార్డ్ స్థాయి వ్యూస్ని దక్కించుకుంది. తాజాగా ఈ గురువారం మేకర్స్ మరో లిరికల్ అప్డేట్ని ఇచ్చారు. పుష్పరాజ్-శ్రీవల్లి కలిసి పాడుకున్న మెలొడీ సాంగ్ను ‘కపుల్ సాంగ్’గా ఈ నెల 29న ఉదయం 11.07 నిమిషాలకు విడుదల చేయనున్నారు. దీనికోసం విడుదల చేసిన ప్రోమోలో రష్మిక మోడరన్గా కనిపించిన అందరికీ షాక్ ఇచ్చేసింది.
ఆమె శ్రీవల్లిగా మారేందుకు మేకప్ చేసుకుంటుంటే, ఆమెపై ఈ ప్రోమోను మేకర్స్ కట్ చేశారు. ‘సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ..’ అని సాగే ఈ గీతానికి రష్మిక డాన్స్ చేస్తుండటం ఈ ప్రోమోలో చూడొచ్చు. ‘పుష్ప’ని మించే స్థాయిలో ఈ ‘పుష్ప 2’ ఉండబోతున్నదని, బన్నీ నటనకు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వప్రతిభకు ఈ సినిమా ఓ నిదర్శనంగా నిలువనున్నదని మైత్రీమూవీమేకర్స్ అధినేతలు నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్ తెలిపారు. ఆగస్ట్ 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా స్థాయిలో ‘పుష్ప2’ విడుదల కానుంది.