బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప-2’ హవా కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నది. తాజాగా మరో రికార్డు ఈ సినిమా ఖాతాలో చేరింది. 21రోజుల్లో 1705 కోట్ల వసూళ్లు సాధించిన తొలి భారతీయ చిత్రంగా ‘పుష్ప-2’ నిలిచింది. దక్షిణాదితో పాటు బాలీవుడ్లోనూ ఈ సినిమా జైత్రయాత్రను సాగిస్తున్నది.
విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్ విషయంలో ఇండియాలో సరికొత్త రికార్డు సృష్టించిన ఈ సినిమా ప్రీమియర్షోల నుంచే సంచలనాలతో దూసుకుపోతున్నదని, మున్ముందు మరిన్ని రికార్డులను అధిగమించడం ఖాయమని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఏర్నేని, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 5న ‘పుష్ప-2’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.