కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) మరణం ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన లేరనే విషయాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్నారు అభిమానులు. కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికీ పునీత్ మరణం నుంచి బయటకు రాలేకపోతున్నారు. అంతలోనే ఆ కుటుంబానికి మరో పిడుగు లాంటి వార్త వచ్చింది. పునీత్ మరణించి నాలుగు నెలలు కూడా కాకముందే ఆ కుటుంబంలో మరొకరు దూరమయ్యారు. పునీత్ రాజ్ కుమార్ మామ రేవనాథ్ (Bhagmane Revanath) గుండెపోటు (heart attack)తో కన్నుమూశారు. ఈయన ఎవరో కాదు పునీత్ భార్య అశ్విని (Ashwini Rajkumar) తండ్రి. అల్లుడు మరణం తర్వాత ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బ తింది. అప్పటి నుంచి తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు రేవనాథ్.
కళ్ల ముందు ఎంతో ఆరోగ్యంగా ఉన్న అల్లుడు పునీత్.. ఒక్కసారిగా గుండెపోటుతో హఠాన్మరణం చెందడంతో ఆయన తట్టుకోలేకపోయాడు. గత నాలుగు నెలలుగా రేవనాథ్ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. తాజాగా ఆయనకు గుండెపోటు రావడంతో బెంగళూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే అశ్విని తండ్రి మరణించారు. ఆయన వయస్సు 78 సంవత్సరాలు. భర్త అనూహ్య మరణం తర్వాత తనకు అన్ని విధాలుగా అండదండగా ఉన్న తండ్రి కూడా మరణించడంతో అశ్విని దుఃఖం ఎవరూ తీర్చలేక పోతున్నారు.
ఆమెను చూసి అందరూ అయ్యో పాపం అంటున్నారు. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆమెకు ఇప్పుడు తండ్రి మరణం కోలుకోలేని విషాదంలోకి నెట్టేసింది. ఇదిలా ఉంటే రాజ్ కుమార్ కుటుంబాన్ని గుండెపోటు మాత్రం వదలడం లేదు. 2006లో కన్నడ నట చక్రవర్తి రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించారు. ఇక గతేడాది అక్టోబర్ 29న పునీత్ కూడా హార్ట్ ఎటాక్ తోనే కన్నుమూసారు. ఇప్పుడు ఆయన మామ సైతం గుండెపోటుతో మరణించడం విషాదకరం. ఆరేళ్ల కింద పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ కూడా గుండెపోటుకు గురయ్యారు.. కానీ ఆయన ప్రాణాలతో బయట పడ్డారు.
మరో అన్నయ్య రాఘవేంద్ర రాజ్ కుమార్ కూడా గుండెపోటుతోపాటు పక్షవాతం వచ్చింది. ఇలా కొన్ని రోజుల వ్యవధిలోనే వాళ్ళ కుటుంబంలో ఇలా ఇద్దరు గుండెపోటుతో మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. కన్నడ సినీ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు కూడా అశ్వినిని ఓదారుస్తున్నారు.