కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం ప్రతి ఒక్కరిని ఎంతో బాధకు గురి చేసింది. ఆయన లేరనే వార్తను ఎవరు నమ్మలేకపోతున్నారు. జీవించింది కేవలం 46 ఏళ్లే అయినప్పటికీ ప్రజల గుండెల్లో చెరిగిపోని స్థానం సంపాదించారు. యాక్టర్, ప్లే బ్యాక్ సింగర్…టెలివిజన్ ప్రెజంటర్, ప్రొడ్యూసర్గా సినిమా ఫీల్డ్లో తన మార్క్ చూపించారు. ఇవన్నీ మనకు కనిపించినవి. కనిపించకుండా పునీత్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
45 ఉచిత పాఠశాలలు, 26 అనాథాశ్రమాలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలల, 1800 మంది విద్యార్ధులకి ఉచిత విద్యను అందించి అందరి మనసులలో చెరగని స్థానం సంపాదించారు. చనిపోయిన కూడా ఆయన సమాధిలో పునీత్ని చూసుకుంటున్నారు. రోజూ వేల మంది వచ్చి పునీత్ సమాధిని దర్శించుకుంటున్నారు. కొద్ది రోజుల క్రితం గంగ, గురు ప్రసాద్ అనే ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవటానికి బళ్లారి నుంచి కంఠీరవ స్టూడియోలోని పునీత్ సమాధి వద్దకు వెళ్లారు.
ఇక తాజాగా మైసూరుకు చెందిన అభిమాని దివంగత యువ నటుడు పునీత్ రాజ్కుమార్పై ఉన్న అభిమానంతో ఆయనకు నివాళులర్పిస్తూ తిరుమల కొండకు పాదయాత్ర ప్రారంభించాడు. మైసూరులోని ఆగ్రహారకు చెందిన మసాజ్ సందీప్ తన అభిమాన హీరో హఠాన్మరణంతో ఆవేదనకు గురయ్యాడు. పునీత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఈనెల 19 నుంచి తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.