Reet Padda | ‘సైయారా’ ఫేమ్ బాలీవుడ్ నటి అనీత్ పడ్డా సోదరి రీత్ పడ్డా ధురంధర్ సినిమాపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ చిత్రంతో పాటు ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ వంటి సినిమాలను అధికార పార్టీ ‘ప్రచార చిత్రాలు’ (Propaganda Films) అని అభివర్ణించడమే కాకుండా, ఆస్కార్ అవార్డుల వేడుకలో ప్రియాంక చోప్రా మౌనాన్ని కూడా ఆమె తప్పుబట్టారు.
‘ధురంధర్ 2’ చిత్రం పూర్తిగా ప్రభుత్వానికి అనుకూలమైన కథనంతో సాగుతుందని, ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు (Demonetisation) వంటి అంశాలను సమర్థించుకోవడానికి రాజకీయ ప్రసంగాలను వాడుకుందని రీత్ పడ్డా ఆరోపించారు. ఇలాంటి సినిమాను ప్రోపగాండా అనడంలో ఎలాంటి సందేహం లేదని ఆమె స్పష్టం చేశారు. అంతేకాకుండా, గతంలో వచ్చిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ చిత్రాలను కూడా ఆమె విమర్శించారు. ఈ సినిమాలు వాస్తవాలను వక్రీకరించి, అతిశయోక్తులతో కూడిన గణాంకాలను చూపిస్తున్నాయని ఆమె అన్నారు. ఉదాహరణకు ‘32,000 మంది మహిళలు మతం మారారు’ అనే వాదనలకు, అధికారిక లెక్కలకు పొంతన లేదని ఆమె పేర్కొన్నారు. ఒక చిన్న నిజాన్ని తీసుకుని, ఒక వర్గానికి వ్యతిరేకంగా పెద్ద కథనాన్ని అల్లడమే ప్రోపగాండా అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో ‘పంజాబ్ 95’ వంటి రాజకీయ చిత్రాలు విడుదల కావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆమె గుర్తు చేశారు. మరోవైపు, అంతర్జాతీయ వేదికైన ఆస్కార్స్ వంటి చోట్ల ఇజ్రాయిల్ – పాలస్తీనా విషయంలో ప్రియాంక చోప్రా మౌనంగా ఉండటాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టింది.