Project-k Movie | ప్రభాస్ ప్రస్తుతం ఓ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ‘బాహుబలి’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తీవ్రంగా నిరాశపడ్డాడు. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే చిత్రం నుండి రిలీజైన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. అయితే షూటింగ్ స్టార్ట్ అయి నెలలు గడుస్తున్న ప్రభాస్ లుక్ను రిలీజ్ చేయలేదని డార్లింగ్ అభిమానులు చిత్రబృందం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం మరోసారి వాయిదా పడనున్నట్లు తెలుస్తుంది.
ముందుగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది చివర్లో లేదంటే 2024 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత అశ్వినీదత్ ప్రకటించాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘ప్రాజెక్ట్-K’ చిత్రం మరో మూడు నెలలు పోస్ట్ పోన్ కానుంది. సై-ఫై జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫ్యూచర్ గురించి ఉంటుందని, వరల్డ్ వార్-3 టైమ్ లైన్లో ఈ సినిమా జరుగుతుందని తెలుస్తుంది. కాగా వీఎఫ్ఎక్స్ ప్రధానంగా ఈ సినిమా సాగుతుందట. దాంతో చిత్రబృందం లేటైనా మంచి అవుట్ పుట్తో రావాలని నిర్ణయించుకుందట. ఈ క్రమంలో మరో మూడు నెలలు పోస్ట్ పోన్ చేస్తూ ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలిని భావిస్తుందట. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుండి అధికారికంగా ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్తో దాదాపు రూ.500 కోట్లతో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది. తెలుగులో దీపికాకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.