‘వ్యక్తిగత పేరుప్రఖ్యాతులు, ప్రశంసల కంటే సినిమా విజయమే నాకు ముఖ్యం. దర్శకత్వం, రచయిత అనే భేదాలు లేకుండా సినిమా కోసం ఏ పనిచేయడానికైనా సిద్ధమే. పనిలోనే నేను ఆనందాన్ని వెతుక్కుంటా’ అని అన్నారు వాసువర్మ. దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించిన ఆయన ‘మోస్ట్ ఎలిజిబుట్ బ్యాచ్లర్’ చిత్రంతో నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు. అఖిల్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో వాసువర్మ మాట్లాడుతూ ‘నేటితరం రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయనే పాయింట్ను ఎంచుకొని దర్శకుడు భాస్కర్ ఈ కథను రాశారు. పెళ్లి చేసుకున్న వారందరూ సంతోషంగా ఉన్నారా? రాజీపడి బతుకుతున్నారా అనే అంశాలతో వినూత్నంగా ఈ సినిమా ఉంటుంది. ఎస్వీకృష్ణారెడ్డి, వినాయక్తో పాటు చాలా మంది దర్శకులతో కలిసి పనిచేశా. క్రెడిట్ కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. అదే నేను చేసిన తప్పుగా భావిస్తున్నా. కానీ ఈ సినిమా విషయంలో నిర్మాతగా నా పేరు వేస్తారని ఊహించలేదు. అనుకోకుండానే దక్కిన క్రెడిట్ ఇది. దర్శకత్వం చేయాలనే ఆలోచనతో ఓ కథ రాసుకుంటున్నా’ అని తెలిపారు.