ఒకప్పటి హిట్ జోడీ శివాజీ, లయ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్కు సుధీర్ శ్రీరామ్ దర్శకుడు. ఈటీవీ విన్తో కలిసి స్వీయ నిర్మాణంలో శివాజీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకురానుంది. మంగళవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు.
దీనికి హాస్యబ్రహ్మా బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని, సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో సింగిల్ స్క్రీన్లలో నాలుగు టికెట్లను 499 రూపాయలకు అందిస్తూ దానికి తోడుగా ఓ పాప్కార్న్ను ఆందించబోతున్నామని శివాజీ తెలిపారు. ఈ సినిమాలో హీరో కామన్ మ్యాన్ పాత్రలో కనిపిస్తారని, ఈ కథ అందరికి కనెక్ట్ అవుతుందని నిర్మాత వంశీ నందిపాటి పేర్కొన్నారు.