తెలుగు సినీరంగంలో పంపిణీదారుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు శ్రేష్ట్ మూవీస్ అధినేత, హీరో నితిన్ తండ్రి ఎన్.సుధాకర్ రెడ్డి. కమల్హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విక్రమ్’ చిత్రాన్ని సుధాకర్రెడ్డి తెలుగులో విడుదల చేసి పెద్ద విజయాన్ని దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ “విక్రమ్’ చిత్రాన్ని ఉభయ తెలుగు రాష్ర్టాల్లో 400లకుపైగా థియేటర్లలో విడుదల చేశాం. ప్రతి కేంద్రం నుంచి అద్భుతమైన స్పందన లభిస్తున్నది. నేటికీ తొలిరోజు మాదిరిగా వసూళ్లు వస్తున్నాయి. దర్శకుడు లోకేష్ కనకరాజ్.. కమల్హాసన్కు వీరాభిమాని. దర్శకుడే హీరో అభిమాని అయితే ఎలా ఉంటుందో హరీష్శంకర్ ద్వారా తెలుసుకున్నాం. దాంతో ఈ సినిమా విజయం ఖాయమనే నమ్మకం ఏర్పడింది.
ఈ సినిమా తెలుగు రిలీజ్ కోసం చాలా మంది పోటీపడ్డారు. సీనియర్ నిర్మాతను కాబట్టి నాపై నమ్మకంతో కమల్హాసన్గారు తక్కువ రేటుకే సినిమా ఇచ్చారు. ఇటీవలే మల్టీఫ్లెక్స్లో షోస్ పెంచాం. ఇప్పటి వరకు సినిమా 20కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా సక్సెస్తో డిస్ట్రిబ్యూటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు. ట్రైలర్ చూసిన వెంటనే..‘సినిమా బాగుంటుంది, తెలుగు రైట్స్ తీసుకో’ అని నితిన్ సలహా ఇచ్చారు’అన్నారు.
టికెట్ రేట్లు పెంచడంపై ఆయన స్పందిస్తూ ‘ప్రస్తుతం థియేటర్లకు పూర్వ వైభవం వచ్చినట్లుగానే కనిపిస్తున్నది. పెద్ద సినిమాలకు భారీగా టికెట్ రేట్లు పెంచొద్దు. టికెట్ రేట్ల పెంపును నేను వ్యతిరేకిస్తాను. బడ్జెట్ పెరిగింది కాబట్టి..టికెట్ రేట్లు పెంచుతామనడం సబబు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడు, నాలుగు వారాలకే ఓటీటీలోకి సినిమాలొస్తున్నాయి. టికెట్ ధరలు ఎక్కువ ఉండటం వల్ల ఓటీటీలో సినిమా చూడొచ్చని అనుకుంటున్నారు.
‘బాహుబలి’ చిత్రం నైజాంలో మామూలు టికెట్ రేట్లతోనే 55కోట్లు వసూలు చేసింది. రేట్లు పెంచడం వల్ల ఫ్యామిలీ ఆడియెన్స్పై భారం పడుతున్నది. ఒక్క కుటుంబం సినిమాకు రావాలంటే మూడునాలుగు వేల రూపాయల్ని వెచ్చించాల్సి వస్తుంది.