ఎన్టీయార్ ‘మనుషులంతా ఒక్కటే’ చిత్ర నిర్మాత వి.మహేశ్(85) శనివారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో మరణించారు. బాత్రూం నుంచి బయటికి వస్తూ కాలుజారి పడిన ఆయనను దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మహేశ్ మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఎన్టీయార్ హీరోగా ఆయన నిర్మించిన ‘మనుషులంతా ఒక్కటే’ చిత్రం చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.
ఎన్టీయార్తోనే ‘మహాపురుషుడు’, చిరంజీవితో ‘సింహపురి సింహం’, సుమన్తో ‘ముసుగుదొంగ’ చిత్రాలను మహేశ్ నిర్మించారు. శ్రీవేంకటేశ్వర భక్తిచానల్లో ప్రసారమైన ‘హరిభక్తుల కథలు’ ధారావాహికకు కూడా ఆయనే నిర్మాత. మహేశ్ మంచి రచయిత కూడా. రచయితగా, నిర్మాతగా పలు పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. ఆయన మృతి పట్ల సినీ, టీవీరంగ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు.