తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పాన్ వరల్డ్కి తీసుకెళ్ళిన సినిమా ‘బాహుబలి’. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు, అత్యధిక వసూళ్లు, ఎన్నో రికార్డులు సృష్టించింది.
ముఖ్యంగా ఇందులోని పాత్రలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. బాహుబలిగా ప్రభాస్ నటన యావత్ సినీ అభిమానుల్ని ఆకట్టుకుంది. శివగామిగా రమ్యకృష్ణ, భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్ ఇలా పాత్రలన్నీ చెరగని ముద్రవేశాయి. అలాగే ఈ చిత్రంలోని పాత్రలు విగ్రహాల రూపంలో కూడా అలరించాయి. అమరేంద్ర బాహుబలి పాత్రలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్లోనూ ఏర్పాటు చేశారు.
ఐతే తాజాగా మైసూర్లోని ఓ మ్యూజియంలో ఏర్పాటు చేసిన అమరేంద్ర బాహుబలి విగ్రహం వివాదమైయింది. ఈ విగ్రహంపై చిత్ర నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ అభ్యంతరం వ్యక్తం చేశారు. కారణం.. ఈ విగ్రహం ఏర్పాటు చేయడానికి నిర్మాతల నుంచి అనుమతి తీసుకోకపోవడమే. ”మా అనుమతి లేకుండా విగ్రహాన్ని తయారు చేసి పెట్టారు. విగ్రహాన్ని తొలగించేలా తగిన చర్యలు తీసుకుంటాం’ అని ట్వీట్ చేశారు నిర్మాత శోభు. మరి వివాదం పై మ్యూజియం యాజమాన్యం ఎలా స్పందిస్తుందో చూడాలి.