ప్రతి థియేటర్లో ముందు తెలుగు పెద్ద హీరోల చిత్రాలు ప్రదర్శింపబడాలనే ఉద్దేశ్యంతో ‘వారసుడు’ చిత్రాన్ని ముందుకు జరిపి ఈ నెల 14న విడుదల చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. దళపతి విజయ్ కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 11న విడుదల కావాల్సి ఉంది.
ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దిల్ రాజు మాట్లాడుతూ ‘ఈ నెల 12న ‘వీరసింహారెడ్డి’, 13న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు విడుదలవుతున్నాయి. పెద్ద స్టార్స్ చిత్రాలకు ఎక్కువ థియేటర్లు కావాలి. నిర్మాతలందరూ బాగుండాలి. అందుకే నేనే ఒక అడుగు వెనక్కి వేశాను. అందరూ నా మీద పడి ఏడుస్తున్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. ఇండస్ట్రీ పెద్దలందరితో చర్చించిన తర్వాతే ‘వారసుడు’ చిత్రాన్ని రెండు రోజులు ఆలస్యంగా విడుదల చేయాలని నిర్ణయించాం. ‘వారసుడు’ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సంక్రాతి సీజన్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
తమిళంలో ఈ చిత్రాన్ని ముందుగా అనుకున్నట్లుగా 11వ తేదీన విడుదల చేస్తున్నాం. అక్కడ ఈ సినిమాకు భారీ విజయం ఖాయమనిపిస్తున్నది. మా సంస్థ నుంచి వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్-2, శతమానం భవతి తరహాలో కుటుంబ ప్రేక్షకులు ఆనందించే చిత్రమిది. ఫ్యామిలీ కోణంలో ఓ కొత్త పాయింట్ చెబుతున్నాం. ప్రతి ఒక్కరూ ఎమోషనల్గా ఫీలవుతారు’ అన్నారు. ఇదొక యూనివర్సల్ సినిమా..ఫ్యామిలీ ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయని శ్రీకాంత్ పేర్కొన్నారు.