‘దొరసాని’, ‘ఏబీసీడీ’, ‘ఊర్వశివో రాక్షసివో’, ‘బేబి’ వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ పేరు తెచ్చుకున్నారు నిర్మాత ధీరజ్ మొగిలినేని. సుహాస్ హీరోగా ఆయన నిర్మిస్తున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’. జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతోంది. దుశ్యంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా నిర్మాత ధీరజ్ చిత్ర విశేషాలను పాత్రికేయులతో పంచుకున్నారు. ‘లాక్డౌన్ తర్వాత దుశ్యంత్ ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ కథను డైలాగ్ వెర్షన్తో చెప్పారు. కథలోని ఎలిమెంట్స్ సహజంగా ఉండి నన్ను ఆకట్టుకున్నాయి. కథలోని సహజత్వం కాస్టింగ్, లొకేషన్స్లోనూ ఉండేలా ప్లాన్ చేసుకున్నాం. ఊరిలో జరిగే కథ కాబట్టి కుల ప్రస్తావన ఉంటుంది. ఏ కులాన్నీ కించపర్చేలా చూపించడంలేదు.
ఏదో సందేశం ఇవ్వాలని కాకుండా ఒక ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల్ని తెరకెక్కించాం అంతే! సుహాస్ను సీరియస్ సబ్జెక్ట్లో చూపించాలనే ప్రధాన పాత్ర కోసం ఆయన్ను తీసుకున్నాం. కమర్షియల్ ఫీల్ రావొద్దని భావించి పేరున్న హీరోయిన్లను తీసుకోలేదు. కథానాయిక ఫ్రెండ్ రోల్ కోసం ఆడిషన్స్ కోసం వచ్చిన శివానిని హీరోయిన్గా ఓకే చేశాం. గీతా ఆర్ట్స్ గుడ్విల్ కాపాడుతూనే కొత్తవాళ్లతో సినిమా చేశాం.
అల్లు అరవింద్ గారు సినిమా చూసి సంతోషంతో మమ్మల్ని హగ్ చేసుకున్నారు. చిన్న కరెక్షన్ కూడా చెప్పలేదు. బాగా నచ్చడంతో రెండోసారీ చూశారు. ప్రస్తుతం రష్మిక మందన్నతో ‘ది గర్ల్ఫ్రెండ్’ సినిమా చేస్తున్నాం. 40 శాతం షూటింగ్ పూర్తయింది. మరో మూడు ప్రాజెక్టులూ రెడీ చేసుకుంటున్నాం. వివరాలు త్వరలో వెల్లడిస్తాం’ అని వివరించారు.