బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాలలో షో ముగియనుండగా, ఈ షోకి సంబంధించి వస్తున్న వార్తలు అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 5 మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ తో మొదలైతే.. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు మాత్రమే ఉన్నారు. వారిలో షణ్ముఖ్, సన్నీ తప్ప.. మిగిలినవారంతా కూడా నామినేషన్ లో ఉన్నారు. శ్రీరామ్, కాజల్, సిరి, ప్రియాంక, మానస్ లలో ఈ వారం హౌస్ నుంచి బయటకు ఎవరు వెళ్లబోతున్నారనే విషయంపై కొద్ది రోజులుగా ఆసక్తికర చర్చ నడవగా,చివరకు ప్రియాంకని ఎలిమినేట్ చేసారనే వార్త బయటకు వచ్చింది.
ప్రియాంక మొదట్లో గేమ్ బాగానే ఆడిన తర్వాత తర్వాత పూర్తిగా మానస్ వైపే పూర్తి దృష్టి పెట్టింది. కొన్ని సార్లు ఆమె ప్రవర్తన ప్రేక్షకులకి కూడా చిరాకు తెప్పించింది. అయినప్పటికీ ఆమె 13 వారాలు హౌజ్లో ఉంది అంటే మాములు విషయం కాదు. బిగ్ బాస్ సీజన్ 3లో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఆమె చాలా త్వరగానే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ప్రియాంక మాత్రం హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎదిగారు.
ట్రాన్స్ జెండర్ కేటగిరీలో హౌస్ లోకి వచ్చిన ప్రియాంకకి పలువురు సెలబ్రిటీలు కూడా సపోర్ట్గా నిలిచారు. కాని గేమ్ లో ఎక్కడ ఓడిపోతానో అనే భయంతోనే గేమ్ ఆడుతూ.. చివరకు నిజంగానే ఓడిపోతుంది ప్రియాంక. బిగ్ బాస్ ఇచ్చిన టికెట్ టు ఫినాలే ఛాన్స్ ను కూడా ఆమె వినియోగించుకోలేకపోయింది. ఈ వారం హౌజ్ నుండి ప్రియాంక ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు.