Kriti Sanon | ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఒక జ్యువెల్లరీ బ్రాండ్ యాడ్ వివాదంపై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు. ముంబైలో జరిగిన ‘ఉమెన్ బిల్డింగ్ సినిమా టెదర్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. మహిళల దుస్తుల ఎంపిక మరియు సాంస్కృతిక విలువల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నా శరీరం, నా ఇష్టం అనే భావన సరైనదే అయినప్పటికీ, దానికి కొన్ని హద్దులు, పరిమితులు ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. పండుగలు, సంప్రదాయాలు ఉన్నప్పుడు గౌరవప్రదంగా, సందర్భోచితంగా ఉండటం చాలా ముఖ్యమని, సమాజంలో అందరికీ ఆమోదయోగ్యం కాని విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.
ఇదే సమయంలో తన కూతురు ప్రియాంక చోప్రా గురించి ప్రస్తావిస్తూ.. తన పిల్లలు కూడా పనుల కోసం, ఇష్టాన్ని బట్టి పాశ్చాత్య దుస్తులు ధరిస్తుంటారని తెలిపారు. అయితే దుస్తుల ఎంపిక అనేది ఆ సందర్భానికి తగినట్లుగా, చూడటానికి అందంగా ఉండాలని, అలా లేకపోతే విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
ఇటీవల ప్రముఖ ఆభరణాల బ్రాండ్ ‘GIVA’ కోసం కృతి సనన్ చేసిన రక్షాబంధన్ ప్రకటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ యాడ్లో ఆమె ఇండో-వెస్ట్రన్ శైలిలో ఉన్న డ్రెస్ ధరించి సోదరుడికి, పెంపుడు కుక్కకు రాఖీ కట్టడం చూపించారు. సాంప్రదాయ పండుగకు ఈ దుస్తులు ఏంటని సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇక ఈ యాడ్పై వ్యతిరేకత పెరగడంతో సదరు బ్రాండ్ ఆ ప్రకటనను వెనక్కి తీసుకుని క్షమాపణలు కూడా చెప్పింది.
మరోవైపు ఈ విమర్శలపై నటి కృతి సనన్ స్పందిస్తూ తన దుస్తులను సమర్థించుకున్నారు. పండుగలకు, సంప్రదాయాలకు బట్టలతో సంబంధం లేదని, అది మనసులోని భావోద్వేగాలకు సంబంధించినదని పేర్కొన్నారు. మహిళలు ఏం ధరించాలో ఇతరులు చెప్పకూడదని, సంస్కృతి అనేది బట్టల మెడలో కాదు హృదయంలో ఉంటుందని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపారు. ప్రస్తుతం ఈ వివాదం మహిళల స్వేచ్ఛ, సాంస్కృతిక సంప్రదాయాల మధ్య చర్చకు దారితీసింది.