హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ప్రాధాన్యం సంతరించుకున్న హైదరాబాద్లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర పురపాలన, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనేకసార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిందని, ఇప్పటికైనా ఆ దిశగా సరైన చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ టెస్టింగ్ ఏర్పాటు విషయమై కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి సదానందగౌడకు మంత్రి కేటీఆర్ ఆదివారం లేఖలు రాశారు. హైదరాబాద్ నగరం కేవలం దేశానికేకాక ప్రపంచ వ్యాక్సిన్ క్యాపిటల్గా ప్రాధాన్యత పొందిందని, దేశీయంగా తయారుచేసిన తొలి వ్యాక్సిన్ కొవాక్సిన్ ఇక్కడి నుంచే తయారవుతున్నదని గుర్తుచేశారు. స్పుత్నిక్ వీ, కొర్బావాక్స్, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీల వ్యాక్సిన్లు సైతం హైదరాబాద్ నుంచే ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియకు అవసరమైన టెస్టింగ్ సెంటర్ను నగరంలో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్నేళ్లలో 100 కోట్ల డోసులు
‘కేంద్ర ప్రభుత్వం ఆగస్టు నుంచి ఈ ఏడాది చివరకు 50 శాతం వాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించింది. దాన్నిబట్టి వచ్చే ఆరు నెలల్లో 100 కోట్ల డోసులు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నదని రిపోర్టులు చెప్తున్నాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న హైదరాబాద్లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ లేకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏకైక వాక్సిన్ టెస్టింగ్ కసౌలిలో ఉంది. ప్రతి బ్యాచ్ వ్యాక్సిన్ను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానాల్లో పంపి, అక్కడి నుంచి రోడ్డుమార్గంలో టెస్టింగ్ సెంటర్కు పంపాల్సి వస్తున్నది. ఈ ప్రక్రియకు 30-45 రోజుల సమయం పడుతున్నది. దీనివల్ల విలువైన సమయం వృధా అవుతున్నదని హైదరాబాద్లోని బయోటెక్ కంపెనీలు పేర్కొంటున్నాయి. దేశంలో రెండో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తే వేగంగా వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయవచ్చు’ అని మంత్రి కేటీఆర్ లేఖలో వివరించారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా పెద్ద ఎత్తున ప్రజలకు వ్యాక్సిన్ అత్యవసరంగా అందించాల్సిన ఈ పరిస్థితుల్లో, సాధ్యమైనంత తక్కువ సమయంలో ఎక్కువ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయాలంటే వ్యాక్సిన్లు తయారవుతున్న హైదరాబాద్లో టెస్టింగ్ సెంటర్ అత్యావశ్యకమని, తక్షణమే దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రతి నెల 8 కోట్ల నుంచి 10 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే వీలు కలుగుతుందని వెల్లడించారు. మూడో దశ కరోనా సెప్టెంబర్-డిసెంబర్ మధ్య వచ్చే అవకాశం ఉందని అంచనాలున్న నేపథ్యంలో వ్యాక్సినేషనే పరిష్కారమార్గమని మంత్రి కేటీఆర్ సూచించారు.
జీనోమ్వ్యాలీలో భూమిస్తాం
వ్యాక్సిన్ సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ముందుకు వస్తే రాష్ట్రప్రభుత్వం ఫాస్ట్ట్రాక్ ప్రాతిపదికన అన్నిరకాల సహాయసహకారాలు అందిస్తుందని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ ఫర్ బయోమెడికల్ రిసెర్చ్, సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లాబరేటరీలాగే వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. హైదరాబాద్లో ఉన్న జీనోమ్ వ్యాలీలో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్కు భూమిని రాష్ట్రప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. రాష్ట్రప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్టు మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు.