ఆహా స్టూడియోస్తో కలిసి బాపినీడు, సుధీర్ ఈదర డ్రీమ్ ఫార్మర్స్ సంస్థ నిర్మించిన చిత్రం ‘భామా కలాపం-2’. అగ్ర కథానాయిక ప్రియమణి ప్రధాన పాత్రలో నటించారు. సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. అభిమన్యు తడిమేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 16 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ బుధవారం మీడియాతో ముచ్చటించింది. హీరోయిన్ ప్రియమణి మాట్లాడుతూ.. “భామా కలాపం-2’లో అన్నీ డబుల్ ఉంటాయి. ఎక్కువ థ్రిల్స్, ట్విస్ట్లతో ఈ సినిమా కథ ఆసక్తికరంగా ఉంటుంది. మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదని ఈ చిత్రం ద్వారా తెలియజెప్పాం’ అని చెప్పారు. ‘నేను కాలేజీలో చదువుకుంటున్నప్పటి నుంచీ ప్రియమణి గారికి అభిమానిని. ఆమెతో వరుసగా రెండు సినిమాలు చేయడం ఆనందంగా ఉంది’ అని దర్శకుడు అన్నారు.