ప్రియదర్శి కథానాయకుడిగా తెలంగాణ నేపథ్య కుటుంబకథా చిత్రం ‘ఇడుపు కాయితం’ గురువారం హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ద్వారా తెలంగాణ జానపద గీతాల ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ కథానాయికగా పరిచయమవుతున్నది. వంశీరెడ్డి దొండపాటి దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై బన్నీ వాస్, తబిత సుకుమార్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, అగ్ర దర్శకుడు సుకుమార్ కెమెరా స్విఛాన్ చేశారు. బన్నీ వాస్ మాట్లాడుతూ ‘అందరి ఇళ్లలో ఉండే సాధారణ సమస్య చుట్టూ ఈ కథ నడుస్తుంది. ‘ఇడుపు కాయితం’ రూపంలో ఓ అద్భుతమైన సినిమాను చూడబోతున్నాం. ఈ సినిమా కోసం నాగదుర్గ 15 కండీషన్స్ పెట్టి ఈ పాత్ర చేసేందుకు అంగీకరించింది.
ఆమె కోసం ఓ ప్రత్యేక గీతాన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. ఆ డ్యాన్స్ నెంబర్కు థియేటర్లన్నీ దద్దరిల్లుతాయి’ అని పేర్కొన్నారు. తాను తెలంగాణ అమ్మాయిని కాబట్టే ఈ కథకు బాగా కనెక్ట్ అయ్యానని నిర్మాతల్లో ఒకరైన తబిత సుకుమార్ చెప్పారు. ‘ఇది తెలంగాణ నేపథ్య సినిమా కావొచ్చు. తెలంగాణ భాష, యాస, తిండి, బట్ట అంతా ఇందులో కనిపించొచ్చు. కానీ గర్వంగా చెబుతున్నా ఇది గ్లోబల్ స్థాయి సినిమా. ఈ కథ మూలాలు మాత్రం అందరి ఇండ్లలో ఉంటాయి’ అని ప్రియదర్శి తెలిపారు. ‘యూట్యూబర్గా మీ అందరికీ పరిచయమైన నేను ‘ఇడుపు కాయితం’ సినిమా ద్వారా కథానాయికగా మీ ముందుకు వస్తున్నాను. ఇందులో శ్రీలతగా బరువైన పాత్రలో కనిపిస్తా. ఇది నాకు బెస్ట్ ఎంట్రీ’ అని కథానాయిక నాగదుర్గ ఆనందం వ్యక్తం చేసింది. బిత్తిరి సత్తి, శివజ్యోతి(సావిత్రి), చంద్రవ్వ, జోర్దార్ సుజాత, రచ్చరవి, మైమ్ మధు, అభయ్ బేతిగంటి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎంఎస్ బాల్రెడ్డి, సంగీతం: సురేష్ బొబ్బిలి, ఆర్ట్: ఆశిష్తేజ, నిర్మాత: బన్నీ వాస్, రచన-దర్శకత్వం: వంశీ రెడ్డి దొండపాటి.