శిల్పాచౌదరి.. ఈ పేరు గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా మారింది. మాయమాటలు చెప్పి ధనవంతులను, సెలబ్రెటీలను మోసం చేసిన ఈమె కిట్టి పార్టీల పేరుతో అందరితో పరిచయాలు పెంచుకుని మోసం చేస్తూ వచ్చింది. పార్టీల్లో పరిచయమైన వారి నుంచి కోట్లాది రూపాయలను వసూలు చేసి, ఆ తర్వాత కనిపించకుండా మకాం మార్చేసింది. చాలామంది ప్రముఖుల్ని మోసం చేసిన శిల్ప.. దాదాపు రూ.200 కోట్ల దాకా కుచ్చు టోపీ పెట్టినట్లు చెబుతున్నారు. అయితే, శిల్ప చౌదరి కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి.
తాజాగా శిల్పా జాబితాలో మహేష్ బాబు చెల్లెలు, హీరో సుధీర్ సతీమణి ప్రియదర్శిని కూడా చేరింది. శిల్పా చౌదరిపై రూ.2.9 కోట్లు ఎగ్గొట్టారంటూ నార్సింగి పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ కిట్టి పార్టీలో శిల్ప తనకు పరిచయమైందని ఆమె తెలిపారు. డబ్బుల కోసమే ఆమె ప్రతి వీకెండ్లో కిట్టి పార్టీ ఏర్పాటు చేసేదని ప్రియదర్శిని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శిల్పను మరోసారి కస్టడిలోకి తీసుకుని డబ్బులు ఎక్కడికి తరలించారనే దానిపై విచారిస్తామని పోలీసులు తెలిపారు.
ఇప్పటికే శిల్పా చౌదరి, ఆమె భర్త శ్రీనివాస్ చౌదరి నుంచి మూడు మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ఫోన్లు తెరిచి అందులోని సమాచారంతో దర్యాప్తు చేయనున్నట్టు తెలుస్తోంది.ఆమె వల్ల కోట్ల రూపాయల్లో మోసపోయిన బాధితులు ఫిర్యాదుచేయడానికి మరి కొందరు ముందుకు రావడంలేదు. ఐటీ కట్టకుండా దాచుకున్న డబ్బు ఆమెకు ఇచ్చినట్టు సమాచారం.